India Heat Wave: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగ భగ ఉదయం 8 గంటల నుంచే తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీచేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అని వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని పలు మైదాన ప్రాంతాల్లో వేడి గాలులు తీవ్రంగా వీచనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండొచ్చని పేర్కొంది.
అలాగే విదర్భ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని IMD వెల్లడించింది.
ఇక శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉన్న టాప్ 50 నగరాలన్నీ భారత్లోనే ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాలు వెల్లడించాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్కు చెందిన నగరాలు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు నగరాలు కూడా ఈ అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ALSO READ:Vijay-Virat Kohli | విజయ్ చేతిలో కోహ్లీ బ్యాట్… ఫోటో వైరల్








