ఆంధ్రప్రదేశ్లో భూ యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’(Mee Bhoomi Mee Hakku) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భూమిపై యజమానికే పూర్తి హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
ప్రజలు కొనుగోలు చేసిన లేదా వారసత్వంగా పొందిన ఆస్తులపై ఎలాంటి అనుమానాలు, వివాదాలు తలెత్తకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాలను అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రతి కుటుంబానికి తమ భూమిపై నమ్మకం, భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం కారణంగా భూ యాజమాన్య హక్కులపై అనేక సందేహాలు తలెత్తాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఆ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి, యజమానుల హక్కులను కాపాడే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసిన సీఎం, భూమి పన్ను రద్దు చేసి రైతులకు ఊరట కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా భూములకు సంపూర్ణ రక్షణ కల్పించే విధానాలను అమలు చేస్తోందని వివరించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన భరోసా కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఆస్తి వివాదాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ భూమి-మీ హక్కు.. ప్రజల ఆస్తికి పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
-








