NEET Protests: NEET ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ వాటిని “సర్కస్”, “తమాషా”గా అభివర్ణించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
దేశంలో జరిగే అనేక నిరసనల్లో రాజకీయ, మతపరమైన అంశాలను ప్రస్తావించడం సాధారణంగా మారిందని కనేరియా వ్యాఖ్యానించారు. ఇలాంటి విధానాల వల్ల భారత్లోనూ నేపాల్ తరహా పరిస్థితులు రావాలని కొందరు భావిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని పేర్కొన్నారు. సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకుండా ఆందోళనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని విమర్శించారు. అయితే భారత విద్యార్థుల నిరసనలను పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ అవమానకరంగా వ్యాఖ్యానించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనేరియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .








