Yuvraj Singh: NEET ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా, పలువురు ప్రముఖులు విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. విద్యార్థులు, యువతకు భద్రమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నాడు. పిల్లలు తమ లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించే సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
పరస్పర చర్చల ద్వారా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సందేశం పంచుకున్నాడు. ఇదిలా ఉండగా, NEET పేపర్ లీక్ అంశం పార్లమెంట్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక నిబంధనల కింద చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండగా, సాధారణ విధానంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది.
ALSO READ: AP Cabinet Meeting | ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన!








