ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మీనంబాక్కం పాత ఎయిర్పోర్ట్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ చేరుకుని ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (ఏఐఆర్ఎస్ఎస్) 2025 కార్యక్రమంలో పాల్గొంటారు.
సదస్సులో పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధక విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉన్న అవకాశాలు, అధునాతన పరిశోధన విధానాలు, ఆంధ్రప్రదేశ్లోని ఆవిష్కరణల ప్రాధాన్యం వంటి అంశాలపై ప్రసంగించనున్నారు.
ఇక చెన్నై టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 4 గంటలకు విజయవాడ తిరిగి చేరుకుంటారు.
ఈ పర్యటనలో విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధి, టీడీపీ బలాన్ని పెంపొందించే అంశాలు చర్చకు రానున్నాయి. చంద్రబాబు పర్యటన విద్యార్థులు, పరిశోధకుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.