Batik Air Flight: ప్రయాణికుల అప్రమత్తతతో ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మలేషియాలోని కౌలాలంపూర్(Kuala Lumpur) నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లోనే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం ప్రకారం, OD231 విమానంలో ప్రయాణిస్తున్న జంషీర్ అతానిక్కల్ (36) అనే వ్యక్తి విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరవడానికి యత్నించాడు. ఈ క్రమంలో ఎగ్జిట్ విండో ప్యానెల్ను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
అతడి అనుమానాస్పద ప్రవర్తనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అడ్డుకుని సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు జంషీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన విమాన భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.
ALSO READ: Rahul Gandhi | రాహుల్ గాంధీ ఇంటి వద్ద కలకలం.. సాధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు








