Amarnath Yatra: జమ్ముకశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కలకలం రేగింది. గందర్బాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది భక్తులు గాయపడగా, బస్సు నదిలోకి దూసుకెళ్లకుండా ఓ ఇల్లు అడ్డుకావడంతో భారీ విషాదం తప్పింది. యాత్ర ముగించుకుని స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు ఈ ప్రమాదంజరిగింది. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ సమీపంలో మలుపు తిరుగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు ఢీకొన్న ప్రభావానికి ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదే బస్సు సింధు నదిలోకి దూసుకెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, సైన్యం, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల ప్రకారం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉండగా, ఎక్కువ మందికి స్వల్ప గాయాలే అయ్యాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా జూలై 2న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు ఈసారి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు 4.15 లక్షల మందికి పైగా మంచు శివలింగాన్ని దర్శించుకోగా, ఆగస్టు 28తో యాత్ర ముగియనుంది.








