India vs Sri Lanka: శ్రీలంక పర్యటనకు సిద్ధమైన టీమిండియాలో అనుభవం, యువతకు సమాన ప్రాధాన్యం దక్కింది. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన జట్టు( Test Squad)ను ప్రకటించింది. జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్లో అనుభవం, యువత కలయికకు ప్రాధాన్యం ఇచ్చిన సెలెక్టర్లు రవీంద్ర జడేజాను తిరిగి జట్టులోకి తీసుకోగా, దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన చేసిన సరన్ష్ జైన్కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం కల్పించారు.
ఐపీఎల్లో గాయపడిన జడేజా పూర్తిగా కోలుకోవడంతో స్పిన్కు అనుకూలమైన శ్రీలంక పిచ్లను దృష్టిలో పెట్టుకుని అతడిపై మళ్లీ నమ్మకం ఉంచారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయంతో తొలి టెస్టుకు దూరం కావడంతో అతని స్థానాన్ని సరన్ష్ జైన్ భర్తీ చేయనున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో బ్యాట్, బంతితో ఆకట్టుకున్న అతడు ఇండియా-ఏ తరఫున చేసిన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టులో ఉన్నప్పటికీ, వీరి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు కొలంబోలో నాలుగు రోజుల సన్నాహక మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో పాయింట్లు మెరుగుపర్చుకోవాలనే లక్ష్యంతో, గత సిరీస్ ఫలితాలను పక్కనపెట్టి భారత్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.








