Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది నివేదిక కోసం సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపింది. విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) ప్రతి కోణంలో కేసును విశ్లేషిస్తోందని, ప్రస్తుతం విమానంలోని థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్ను ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ వద్ద పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే ప్రాథమిక నివేదిక, తాత్కాలిక ప్రకటనను AAIB వెబ్సైట్లో విడుదల చేసినట్లు పేర్కొంది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన 35 సెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 241 మంది, నేలపై ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు.
ప్రాథమిక పరిశీలనలో రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని గుర్తించినప్పటికీ, కాక్పిట్ వాయిస్ రికార్డర్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను కూడా లోతుగా విశ్లేషిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలను నమ్మొద్దని, తుది నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణాలను అధికారికంగా వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ALSO READ: KCR | యశోద ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ భరోసా.. ఆరోగ్యంపై ఆరా








