Siricilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో భారీ వృక్షం నేలకొరిగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బలహీనమైన భారీ వేపచెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన అరుకుటి రాజు తన మినీ వ్యాన్లో పనిమీద వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాంధీ చౌరస్తా నుంచి పెద్ద బజార్ మార్గంలో రోడ్డుపక్కన ఉన్న భారీ వేపచెట్టు అకస్మాత్తుగా కూలి అతడు ప్రయాణిస్తున్న వ్యాన్పై పడింది.
ఈ ప్రమాదంలో వ్యాన్ దెబ్బతినడంతో పాటు రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని బయటకు తీసి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక కౌన్సిలర్, అధికారులకు విషయం తెలియజేశారు. రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే ప్రాంతంలోని హనుమాన్ ఆలయం, విమల్ థియేటర్ పరిసరాల్లో ఉన్న ప్రమాదకరమైన భారీ వృక్షాలను కూడా తొలగించాలని అధికారులను కోరారు.
గతంలో పలుమార్లు ప్రమాదకర చెట్ల తొలగింపుపై సూచించినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








