UN Security Council: పశ్చిమాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, ఇటీవల హర్మూజ్ జలసంధిలో పలు వాణిజ్య నౌకలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపారు.
జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ ఏఐ బహియాహ్, ఎంటీ మొంబాసా నౌకలపై జరిగిన ఘటనల్లో భారతీయులు ప్రభావితమైనట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఒక భారతీయుడు మరణించగా, మరో వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు. పలువురు గాయపడినట్లు పేర్కొన్నారు. పౌరులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిగే హింసాత్మక చర్యలను తక్షణమే నిలిపివేయాలని భారత్ కోరింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత విషయంలో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.
సముద్ర రవాణాపై హూతీలు కొనసాగిస్తున్న దాడులను భారత్ ఖండించింది. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని పేర్కొంది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం సాధించేందుకు ఘర్షణలకు బదులుగా దౌత్య చర్చలే సరైన మార్గమని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
ALSO READ: Supreme Court | లైవ్ వీడియో ఉంటుంది.. కానీ ఆడియో ఉండదు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం








