Engineering: తెలంగాణలో బీటెక్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) అనుమతులు ఇచ్చింది.
మొత్తం 15 వేల వరకు అదనపు సీట్లకు గ్రీన్సిగ్నల్ లభించినప్పటికీ, వాటిని కౌన్సెలింగ్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదనపు సీట్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సీఎం అనుమతి రావడంతో కళాశాలలు, కోర్సుల వారీగా సీట్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం రెండో విడత కౌన్సెలింగ్లో దాదాపు 4 వేల కొత్త సీట్లు చేరే అవకాశం ఉంది. ఇందులో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, అదనపు సీట్లపై త్వరలో అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏ కళాశాలకు ఎన్ని సీట్లు పెరుగుతాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు తొలి విడత కౌన్సెలింగ్ తర్వాత కూడా 27,487 ఇంజినీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కాని 8,162 సీట్లతో పాటు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని 19,325 సీట్లు ఇందులో ఉన్నాయి. అదనపు సీట్లు కూడా అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మంచి కళాశాలలు, నచ్చిన కోర్సులు ఎంచుకునే అవకాశాలు మరింత పెరగనున్నాయి.








