Reliance Jio: రిలయన్స్ జియో ప్రతిపాదించిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు ముందడుగు పడింది. భూమికి సమీప కక్ష్యలో (Low Earth Orbit – LEO) 1,600 ఉపగ్రహాలతో భారీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికకు భారత అంతరిక్ష కార్యకలాపాల నియంత్రణ సంస్థ IN-SPACe నుంచి సాంకేతిక అనుమతి లభించింది. ఈ అనుమతికి ముందు ఇస్రో, వైర్లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ (WPC) విభాగాలతో కలిసి ప్రాజెక్టు సామర్థ్యం, సాంకేతిక అంశాలను అధికారులు పరిశీలించారు. జియో ప్రతిపాదించిన వ్యవస్థ ద్వారా భారత్లో సెకనుకు 4.5 నుంచి 5 టెరాబిట్ల వరకు డేటా సామర్థ్యం అందించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఇది ప్రస్తుతం అనుమతి పొందిన ఇతర శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టుల సామర్థ్యాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. జియో ఈ నెట్వర్క్ కోసం దేశవ్యాప్తంగా 20 నుంచి 22 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా వేగవంతమైన బ్రాడ్బ్యాండ్, మొబైల్ కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
అంతేకాకుండా విదేశీ శాటిలైట్ సేవలపై ఆధారపడే పరిస్థితి తగ్గడంతో పాటు, దేశ భద్రత, వ్యూహాత్మక అవసరాలకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. IN-SPACe అనుమతితో జియో అంతర్జాతీయ ఆర్బిటల్ స్లాట్ల కోసం తదుపరి ప్రక్రియలను ప్రారంభించనుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU)లో దాఖలాలు, ఇతర దేశాలతో సమన్వయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనుంది. భారత్లో స్వదేశీ LEO శాటిలైట్ వ్యవస్థ అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా మారనుంది.
ALSO READ: Engineering | బీటెక్ ఆశావహులకు బిగ్ న్యూస్.. వేలల్లో పెరగనున్న సీట్లు








