COVID-19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ నెమ్మదిగా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలై ప్రారంభం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య 340 దాటడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూడా గత మూడు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల నమోదైన 13 కేసుల్లో కడప జిల్లాలోనే 8 మంది వైరస్ బారిన పడగా, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు గుర్తించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ముగ్గురు బాధితులు హోం ఐసోలేషన్లో ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు మరణించినట్లు అధికారిక సమాచారం. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళకు తాజాగా కరోనా నిర్ధారణ కావడంతో ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. వైరస్ ఏ వేరియంట్కు చెందినదో తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేలోని ప్రత్యేక ప్రయోగశాలకు పంపించారు.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితిపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.








