Puri Jagannath Rath Yatra: ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర ఒడిశాలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ఆరంభమైంది. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహోత్సవం భారత ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. మహాప్రభు జగన్నాథుడి ఆశీస్సులతో దేశంలో ఐక్యత, సంతోషం, శ్రేయస్సు పెరగాలని ఆకాంక్షించారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన సందేశంలో రథయాత్ర వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ విదేశాల్లోని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తుడు-భగవంతుని కలయికకు ప్రతీకగా ఈ మహోత్సవం నిలుస్తుందని పేర్కొన్నారు. పూరీ జగన్నాథ ఆలయం సింహద్వారం వద్ద శ్రీ జగన్నాథ స్వామివారి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్ర అమ్మవారి దర్పదళన రథాలు సిద్ధంగా ఉంచారు. రథయాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు. భారీ జనసందోహం నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
సుమారు 13 వేల మంది పోలీసు సిబ్బంది, 15 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, NSG కమాండోలు, 500 మంది లైఫ్గార్డులు, నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు బృందాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో పాటు భూమి, సముద్రం, గగనతలం నుంచి నిరంతర నిఘా కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, అత్యవసర సేవలు, భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.








