China Floods: టైఫూన్ ప్రభావంతో చైనాలోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలతో అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, జలాశయాల ఉద్ధృత ప్రవాహం కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి ఒక పాముల పెంపకం కేంద్రం దెబ్బతినడంతో వందల సంఖ్యలో పాములు బయటకు రావడంతో స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
హెంగ్జౌ నగర పరిసరాల్లో ఉన్న సర్పాల పెంపకం కేంద్రంలో సుమారు 900 పాములు ఉండగా, వరద నీటి ఉద్ధృతికి ఆ కేంద్రం ధ్వంసమైంది. దీంతో అక్కడ ఉన్న పాములు వరద నీటితో పాటు సమీప గ్రామాల వైపు చేరినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పాములు కనిపిస్తున్నాయనే సమాచారంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
టైఫూన్ కారణంగా లియులాన్, యున్బియావో జలాశయాలు పొంగిపొర్లడంతో వరదల తీవ్రత మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు ఈ పాముల ముప్పు కూడా అదనపు ఆందోళనగా మారింది.
పారిపోయిన పాముల్లో కోబ్రా వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు పెంపకం కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. దీంతో స్థానిక అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పాములను గుర్తించి పట్టుకునే చర్యలు చేపట్టింది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.








