అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల అనంతరం ఇరాన్(Iran) మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాస సముదాయానికి జరిగిన నష్టానికి సంబంధించిన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా తొలిసారిగా బహిర్గతం చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా విడుదల చేసిన సుమారు 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో టెహ్రాన్లోని ‘ఇమామ్ ఖమేనీ హుసైనియా హాల్’ తీవ్రంగా ధ్వంసమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పైకప్పు కూలిపోవడం, ఉక్కు బీమ్లు వంకర తిరగడం, శిథిలాలు పేరుకుపోవడం వంటి దృశ్యాలు అందులో నమోదయ్యాయి. గతంలో ఇదే ప్రాంగణంలో ఖమేనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం, కీలక సమావేశాలు నిర్వహించడం జరిగేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఫిబ్రవరి చివర్లో జరిగిన దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించగా, ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రకటించింది. కుమారుడు మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని టెహ్రాన్, కోమ్, ఇరాక్లోని నజఫ్, కర్బలా నగరాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచి, చివరగా స్వస్థలం మషద్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై మరోసారి దాడులు చేపట్టినట్లు అమెరికా ప్రకటించగా, ప్రతిగా బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. దీంతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై కూడా అనిశ్చితి నెలకొంది.
ALSO READ: LPG cylinders | మహారాష్ట్రలో భారీ వర్షాల బీభత్సం.. వరదలో కొట్టుకెళ్లిన LPG సిలిండర్లు








