తమిళనాడులో కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఊరటనిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ విషాదంలో బాధితులైన కుటుంబాలకు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మధురై బెంచ్ మధ్యంతర అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన భారీ రాజకీయ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలా అండగా నిలుస్తుందనే అంశం ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ కరూర్కు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా పరామర్శించడంతో పాటు, వారి జీవనోపాధికి భరోసాగా ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఉద్యోగాల పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నియామకాలు తుది న్యాయ నిర్ణయానికి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రజా విషాదాల బాధితులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాని(Tamil Nadu government)కి ఏకరీతి విధానం అవసరమా అనే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం పరిమితంగానే ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో బాధిత కుటుంబాలకు తక్షణ ఊరట లభించగా, ఈ వ్యవహారంపై తుది విచారణ తర్వాత మరిన్ని స్పష్టతలు వచ్చే అవకాశం ఉంది.
Madras High Court | బాధితులకు ఉద్యోగాలు ఇస్తాం.. విజయ్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-








