Telangana: తెలంగాణలో విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రతిపాదనను నిలిపివేయడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ తీసుకురావడం, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి డిమాండ్లతో ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను గణనీయంగా తగ్గించే ప్రతిపాదనను విరమించుకోవాలని, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించాలని వారు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, లెక్చరర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించడం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పుస్తకాలు, నోట్బుక్స్ విక్రయాలను తప్పనిసరి చేయడాన్ని నియంత్రించాలని, విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చే విధానాలను అడ్డుకోవాలని సంఘాలు పేర్కొన్నాయి.
బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ముందస్తుగా సెలవులు ప్రకటించాయి. గురువారం నుంచే తల్లిదండ్రులకు సందేశాలు పంపి శుక్రవారం తరగతులు ఉండవని తెలియజేశాయి. శుక్రవారం బంద్, శనివారం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. అయితే, ఏ జిల్లాల్లో ఎంత మేరకు బంద్ ప్రభావం ఉంటుందనేది స్థానిక పరిస్థితులు, ఆయా విద్యాసంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.








