CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో రేవంత్ రెడ్డి వంటగదిలో నిలబడి పూరీలు తయారు చేస్తుండగా, పక్కనే ఉన్న మనవడు ఎంతో ఉత్సాహంగా సూచనలు చేస్తూ కనిపించాడు.
తాత చేసిన పూరీలు గుండ్రంగా రావడం లేదంటూ అమాయకంగా వ్యాఖ్యానించడం వీడియోకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు “ఇంకా పూరీలు వేయండి.. అమ్మమ్మకు, నాన్నకు కూడా కావాలి” అంటూ మనవడు చెప్పిన మాటలు చూసి పలువురు చిరునవ్వులు చిందిస్తున్నారు.
ఈ వీడియోకు రేవంత్ రెడ్డి కూడా హృదయాన్ని హత్తుకునే క్యాప్షన్ జోడించారు. “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు చెప్పిన తర్వాత అతడి కోరికను ఎలా కాదనగలనని పేర్కొన్నారు. చేతిలో పిండితో, పక్కనే మనవడితో గడిపిన ఆ కొద్ది క్షణాలు తనకు ఎంతో విలువైన మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని ఆయన వెల్లడించారు.
సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పోస్టులనే పంచుకునే ముఖ్యమంత్రి, ఈసారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీసింది. రాజకీయ నాయకుడి కంటే తాతగా కనిపించిన రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కుటుంబ బంధాలకు సమయం కేటాయించడం ఆనందకరమని, ఈ వీడియో ఎంతో సహజంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.








