Heavy rainfall: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు, రైల్వే ట్రాక్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు పాత ముంబై-గోవా జాతీయ రహదారిపై కూడా వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే సేవలపైనా భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్జాత్-ఖోపోలి మార్గంలో వరద నీటి ఉధృతి కారణంగా రైల్వే పట్టాల కింద ఉన్న కంకర పొర కొట్టుకుపోవడంతో భద్రతా దృష్ట్యా లోకల్ రైలు సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో వసాయ్-విరార్ సెక్షన్లో కూడా ట్రాక్లపై నీరు నిలవడంతో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
భారీ వర్షాల ప్రభావంతో వెస్ట్రన్ రైల్వే లోకల్ రైలు సేవలు 15–20 నిమిషాల జాప్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు స్టేషన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అవసరం లేకుంటే బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.








