Iran: భారత ప్రతినిధి బృందం ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడం పట్ల ఇరాన్ అధికార వర్గాలు స్పందిస్తూ, రెండు దేశాల స్నేహబంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, ప్రజలు, రాజకీయ నాయకులు వ్యక్తం చేసిన సానుభూతి, సంఘీభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధాలను గుర్తు చేసింది.
భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విడుదల చేసిన ప్రకటనలో, ఈ క్లిష్ట సమయంలో భారత్ అందించిన మద్దతు తమ ప్రజలకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొంది. భారత ప్రతినిధుల హాజరు పరస్పర గౌరవం, విశ్వాసం, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచిందని తెలిపింది.
భారత రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ మతాల ప్రతినిధులు, మేధావులు అంత్యక్రియలకు హాజరుకావడం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సాన్నిహిత్యానికి నిదర్శనమని ఇరాన్ అభిప్రాయపడింది. ఈ సందర్భంలో భారత్ ప్రదర్శించిన స్నేహపూర్వక వైఖరిని ఇరాన్ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని పేర్కొంది.
టెహ్రాన్లో నిర్వహించిన అంత్యక్రియల్లో భారత ప్రభుత్వ తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరెట్, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా హాజరై నివాళులర్పించారు. ఈ పరిణామం భారత్-ఇరాన్ మధ్య ఉన్న దౌత్య, సాంస్కృతిక సంబంధాలకు మరోసారి బలం చేకూర్చిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Iran | భారత్ కి ఇరాన్ ధన్యవాదాలు.. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతినిధి బృందంపై ప్రశంసలు
-








