Thailand Road Accident: థాయ్లాండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. పాదయాత్రలో వెళ్తున్న బౌద్ధ సన్యాసుల బృందంపై ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ముక్దహాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ఓ ఆలయం నుంచి మరో ఆలయానికి ఆధ్యాత్మిక పాదయాత్ర చేపట్టిన బౌద్ధ సన్యాసులు, వారి అనుచరులు రహదారి పక్కన క్రమశిక్షణతో నడుస్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే వేగంగా వచ్చిన పికప్ ట్రక్ నేరుగా వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు సన్యాసులు ఘటనాస్థలిలోనే మృతిచెందగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో నలుగురు అనంతరం ప్రాణాలు విడిచారు. మొత్తం 22 మంది సన్యాసులతో పాటు ఒక అనుచరుడు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో నలుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 11 ఏళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న పికప్ ట్రక్ను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ప్రమాదం తర్వాత బాలుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురికావడంతో వెంటనే విచారణ చేపట్టలేకపోయామని, ప్రస్తుతం బాలల సంక్షేమ అధికారుల సమక్షంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో రహదారి పక్కన నడుస్తున్న సన్యాసులపైకి పికప్ ట్రక్ ఒక్కసారిగా దూసుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషాద ఘటనపై థాయ్లాండ్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.








