Anupama Singh: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో భారత్ పాకిస్థాన్పై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. జెనీవాలో జరిగిన 62వ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి బృందం తరఫున ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ చేసిన ప్రసంగం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
భారత్కు కేటాయించిన ‘రైట్ టు రిప్లై’ హక్కును వినియోగించిన ఆమె, జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో పాటు ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ వేదికలపై బాధితుడిగా నటించడం పాకిస్థాన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
తన ప్రసంగంలో పాకిస్థాన్ను “తానే సృష్టించిన ఉగ్రవాద రాక్షసుడికి బలైన ఫ్రాంకెన్స్టెయిన్ దేశం”గా అభివర్ణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, శిక్షణ, మద్దతు ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, అదే దేశం ఉగ్రవాద బాధితమని చెప్పుకోవడం విరుద్ధంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు, పౌరులపై జరుగుతున్న అణచివేత ఘటనలను కూడా ఆమె ప్రస్తావించారు. ఆహారం, విద్యుత్, ప్రాథమిక హక్కుల కోసం ప్రజలు పోరాడుతుంటే ప్రతిగా హింస ఎదురవుతుండటం ఆందోళనకరమని అన్నారు.
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని సూచిస్తూ, సరిహద్దు భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని పాత ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా తెలిపారు. చివరగా జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఈ అంశంపై ఎవరి అభిప్రాయం మారినా వాస్తవం మారదని ఆమె స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆరోపణలను “రాజకీయ నాటకాలు”గా అభివర్ణిస్తూ, తమ దేశ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Anupama Singh | UN వేదికపై పాక్కు షాక్.. “ఫ్రాంకెన్స్టెయిన్ దేశం” అంటూ భారత్ ఫైర్
-








