Ebola Virus: ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికన్ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించి భారత్కు వచ్చిన ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది. వారు తమ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించుకోవడంతో పాటు అవసరమైతే స్వీయ నిర్బంధంలో ఉండాలని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ మార్గదర్శకాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది.
అయితే గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారు లేదా ఆ ప్రాంతాల మీదుగా ప్రయాణించినవారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది.
అలాగే ఆరోగ్య అధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ముందస్తు సమాచారం ద్వారా బాధితుల ఆరోగ్య రక్షణతో పాటు వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపింది.
ఎబోలా సంబంధిత అనుమానాలు లేదా సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1075 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచించింది.








