NEET UG 2026: నీట్-యూజీ 2026 రీఎగ్జామ్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. జూన్ 21న జరగనున్న రీఎగ్జామ్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షా విధానాన్ని చివరి నిమిషంలో మార్చడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది.
ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు తక్కువ సమయం మాత్రమే ఉండటంతో పాటు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై ఉన్న పరిపాలనా భారం కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానంలో మార్పులు చేయడం ప్రాయోగికంగా సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో నీట్ పరీక్షను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని, ప్రశ్నపత్రాల భద్రత కోసం ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్ ఉపయోగించాలని కోరారు.
అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత నిఘా వ్యవస్థలు తీసుకురావాలని సూచించారు. అయితే ఈ దశలో అలాంటి మార్పులు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అదే సమయంలో నీట్ పరీక్షా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని కోర్టు గుర్తించింది.
ఈ అంశంపై వేసవి సెలవుల అనంతరం సుదీర్ఘ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో పరీక్షా విధానంలో మార్పులపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.








