PM Narendra Modi: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘రోజ్గార్ మేళా’ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో పాల్గొని, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ మెగా నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, హోం వ్యవహారాలు, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక రంగాల్లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఉద్యోగాలు సాధించిన యువత దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.“వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతే ప్రధాన శక్తి” అని ఆయన పేర్కొన్నారు. కొత్త అవకాశాల ద్వారా యువతను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
భారత యువత ప్రతిభ, సాంకేతిక పురోగతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు భారత్తో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 18 విడతల్లో కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 12 లక్షల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. తాజాగా జరిగిన ఈ విడతతో దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
PM Narendra Modi | నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నియామకాలు
-








