Pulwama attack: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో భారత వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్ర నెట్వర్క్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. 2019లో పుల్వామా సూత్రధారి అయిన ఉగ్రదాడి వెనుక కీలకంగా భావించబడుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అర్జుమండ్ గుల్జార్ దార్ అలియాస్ ‘హంజా బుర్హాన్’ ముజఫరాబాద్లో హతమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
తెలియని దుండగులు జరిపిన మెరుపు కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. పీఓకేలోని ముజఫరాబాద్ ప్రాంతంలో అతడిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉగ్రవాద నెట్వర్క్లో కలకలం రేగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హంజా బుర్హాన్ జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందినవాడిగా గుర్తించబడగా, అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థలో కీలక కమాండర్గా పనిచేసినట్లు సమాచారం.
లోయలో యువతను ఉగ్రవాద వైపు ప్రేరేపించడం, భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికలు రచించడం వంటి కార్యకలాపాల్లో అతడి పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ దాడి వెనుక ఉన్న నెట్వర్క్లో హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు వర్గాలు గతంలో గుర్తించాయి.
ఈ ఉగ్రవాది దుర్మరణ వార్తతో భారత్లోని భద్రతా వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి బాధిత కుటుంబాలకు ఇది కొంత ఊరటగా భావించబడుతోంది. అయితే ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. గత కొంతకాలంగా పీఓకేలోని ఉగ్రవాదులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన కూడా అదే కోవలోకి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.








