Indonesia: భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ(Pm Narendra Modi) ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. ఆయనకు అక్కడి ప్రభుత్వం అత్యంత గౌరవప్రదంగా స్వాగతం పలికింది. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అధికారిక సైనిక లాంఛనాలతో మోడీకి స్వాగతం లభించగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా హాజరై ఆయనను ఆహ్వానించడం ఈ పర్యటనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రధాని మోడీ పర్యటనకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించిన ఇండోనేషియా ప్రభుత్వం, ఆయన ప్రత్యేక విమానం తమ గగనతలంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు మోడీ ప్రయాణిస్తున్న విమానానికి ఎస్కార్ట్గా వ్యవహరించి, జకార్తా విమానాశ్రయం వరకు భద్రత కల్పించాయి. ఇది అత్యంత ప్రాధాన్య అతిథులకు మాత్రమే కల్పించే ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
రక్షణ రంగంలో సహకారం, సముద్ర భద్రత, ఇంధన భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాల విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు ప్రధాన అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటనతో భారత్-ఇండోనేషియా సంబంధాలు మరింత బలపడటంతో పాటు ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Telangana Tourism | టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్








