Akkineni Akhil: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. త్వరలో విడుదల కానున్న అఖిల్ అక్కినేని తాజా చిత్రం ‘లెనిన్’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున కుటుంబం శ్రీవారి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున, అమల, అఖిల్తో పాటు చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే, నటుడు సునీల్, నిర్మాత నాగవంశీ ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 88 వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 31 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం రూ.5 కోట్లకు పైగా నమోదైంది. అదే రోజు లక్షలాది లడ్డూలను విక్రయించడంతో పాటు, భారీ సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Akkineni Akhil | ‘లెనిన్’ విజయానికి శ్రీవారి ఆశీస్సులు.. తిరుమలలో నాగార్జున కుటుంబం ప్రత్యేక పూజలు
-








