China- US: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనాను కేంద్రంగా చేసుకుని కొత్త దౌత్య వివాదం నెలకొంది. అమెరికా ఇరాన్తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంపై చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ కఠిన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్తో తమకు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య, ఇంధన ఒప్పందాలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బీజింగ్ స్పష్టం చేసింది.
ఈ వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని, ముఖ్యంగా అమెరికా జోక్యం పూర్తిగా అనవసరమని చైనా గట్టిగా పేర్కొంది.
హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా ఆలోచనను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని, ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేదా అడ్డంకులు ఉండకూడదని చైనా అభిప్రాయపడింది.
హర్మూజ్ జలసంధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నౌకల రవాణా నిరంతరం, స్వేచ్ఛగా కొనసాగాలని పిలుపునిచ్చింది.
చైనా అధికారులు తెలిపిన ప్రకారం, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలను బీజింగ్ సమగ్రంగా పరిశీలిస్తోంది. హర్మూజ్ జలసంధిలో చైనా నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం చైనా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇక హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలోనే కొనసాగుతుందని, అక్కడి మార్గాలపై చైనా నౌకలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీజింగ్ స్పష్టం చేసింది.
అదే సమయంలో యుద్ధ పరిస్థితులను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు చైనా తన మద్దతు కొనసాగిస్తుందని తెలిపింది.








