IPL 2026: ఆడింది నాలుగు మ్యాచులే అయినా అప్పుడే ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ ప్రతిభతో క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు కేవలం 26 బంతుల్లో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో అతను ఆరెంజ్ క్యాప్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఈ మ్యాచ్లో తొలి పరాజయాన్ని అందించాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచే వైభవ్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్లోనే వరుసగా రెండు బౌండరీలు బాది తన ఉద్దేశాన్ని స్పష్టంగా చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
జోష్ హేజిల్వుడ్, కృనాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, అభినవ్ సింగ్ వంటి అనుభవజ్ఞుల బౌలింగ్ను కూడా అతను సమర్థంగా ఎదుర్కొని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో ఏడు భారీ సిక్సర్లు బాదడం విశేషం.
ఈ సీజన్లో వైభవ్కు ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా, నాలుగు మ్యాచ్ల్లో 200 పరుగులు సాధించాడు. 50 సగటుతో పాటు 266.67 స్ట్రైక్ రేట్తో దూసుకుపోతూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
యశస్వి జైస్వాల్ 183 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా సిక్సర్ల జాబితాలో కూడా వైభవ్ 18 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు. రజత్ పటిదార్ 13 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ యువ ఆటగాడి అద్భుత ఫామ్ ఐపీఎల్ 2026లో కొత్త సంచలనంగా మారింది. భవిష్యత్లో భారత క్రికెట్కు అతను పెద్ద స్టార్గా ఎదగనున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








