కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే చిరంజీవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
“మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన జీవితాంతం అంకితభావంతో పనిచేశారు. తాను విశ్వసించిన సిద్ధాంతాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిలబడిన వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజల కోసం చేసిన నిరంతర పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని చిరంజీవి పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్న చిరంజీవి, ఆయన మరణం సమాజానికి, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. “ముద్రగడ పద్మనాభం ఆత్మకు సద్గతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో అయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. ఓం శాంతి” అంటూ ఆయన నివాళులర్పించారు. చిరంజీవి పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా, పలువురు అభిమానులు, రాజకీయ నాయకులు కూడా ముద్రగడకు తమ నివాళులు అర్పిస్తూ సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు.








