దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ ముడి చమురు మళ్లీ భారత్కు(india iran oil imports) చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి చుట్టూ సరఫరా అంతరాయాలు, అలాగే అమెరికా తాజాగా కొన్ని ఇరాన్ చమురు సరఫరాలపై తాత్కాలిక సడలింపులు ఇవ్వడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది.
అంతర్జాతీయ షిప్పింగ్ ట్రాకింగ్ డేటా ప్రకారం, మొదట చైనా వైపు వెళ్లాల్సిన ‘జయ’ అనే భారీ చమురు నౌక ఇప్పుడు భారత్ తూర్పు తీరానికి మళ్లినట్లు సమాచారం.
ఈ సరుకును ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగించే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు ఇరాన్ నుంచి అత్యధికంగా ముడి చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ కూడా ముందువరుసలో ఉండేది. 2018లో రోజుకు దాదాపు 5.18 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసిన భారత్, 2019 మే నాటికి ఆ పరిమాణాన్ని 2.68 లక్షల బ్యారెళ్లకు తగ్గించింది.
అనంతరం అమెరికా విధించిన కఠిన ఆంక్షల ప్రభావంతో, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.
ఇప్పుడు సరఫరా ఒత్తిడి, పెరిగిన అంతర్జాతీయ ధరలు, ప్రత్యామ్నాయ వనరుల అవసరం కారణంగా భారత రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి.
ఇదే సమయంలో ‘జోర్డాన్’ అనే మరో నౌక కూడా భారత్ను గమ్యస్థానంగా సూచించినట్లు రవాణా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో భారత్కు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే మరో సరుకు నౌక మార్గం మార్చుకుని చైనా వైపు వెళ్లినట్లు కూడా నివేదికలు తెలిపాయి.
అయితే ప్రస్తుతం ఇరాన్ నుంచి భారత్కు మళ్లీ చమురు రాక ప్రారంభమైతే, అది దేశీయ రిఫైనరీలకు సరఫరా భద్రత పరంగా కీలక మద్దతు ఇవ్వొచ్చు.
ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో, ఇరాన్ చమురు పునరాగమనం భారత ఇంధన వ్యూహంలో కొత్త మలుపుగా మారే అవకాశముంది.








