US–Iran Tension: అమెరికా–ఇరాన్ (Iran USA Relations) సంబంధాల్లో మరోసారి ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఒమన్లో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతుండగా, మరోవైపు ఇరాన్పై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. ఇరాన్ ముడిచమురు వ్యాపారంతో సంబంధం ఉన్న 15 సంస్థలు, 14 రహస్య నౌకలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇరాన్ చమురు ద్వారా సంపాదిస్తున్న ఆదాయాన్ని విదేశాల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, తమ పౌరులను అణచివేయడానికి ఉపయోగిస్తున్నదని అమెరికా ఆరోపించింది. అందుకే ముడిచమురు, పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార నెట్వర్క్ను పూర్తిగా అడ్డుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా, ఒమన్లో అమెరికా ప్రతినిధులతో ప్రారంభమైన చర్చలను ‘చాలా మంచి ఆరంభం’గా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అభివర్ణించారు. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు.
ఇరాన్తో అణు(Iran Nuclear Deal) ఒప్పందం కుదుర్చుకునేలా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. డీల్ కుదరకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదన్నది అమెరికా ప్రధాన షరతుగా పేర్కొంది. చర్చలు–ఆంక్షలు రెండూ ఒకేసారి కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
also read:U19 World Cup Final | వైభవ్ సూర్యవంశీ షో.. భారత్కు ఆరో కప్








