శుక్రవారం నుంచి ఇరాన్ మాజీ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమాలు టెహ్రాన్ కేంద్రంగా జరిగి మొత్తం ఏడు రోజుల పాటు కొనసాగనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ ప్రసార సంస్థ ఐఆర్ఐబీ వెల్లడించింది.
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ (86) మరణించినట్లు సమాచారం. మొదట మార్చిలోనే అంత్యక్రియలు నిర్వహించాలని భావించినప్పటికీ, దేశంలో కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇరాన్ సిద్ధమైంది.
ప్రారంభ దశలో శుక్రవారం టెహ్రాన్లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం ప్రజల సందర్శన కోసం భౌతికకాయాన్ని గ్రాండ్ మొసల్లాలో ఉంచనున్నారు. అనంతరం సోమ, మంగళవారాల్లో క్వోమ్ నగరానికి అంతిమయాత్ర కొనసాగనుంది.
బుధవారం నజఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారిక స్వాగతం అనంతరం ఇరాక్లోని నజఫ్, కర్బలా నగరాల్లో ప్రజా అంతిమయాత్రలు నిర్వహించనున్నారు. చివరి దశగా వచ్చే శుక్రవారం మష్హాద్లోని ఇమామ్ రెజా దర్గా వద్ద అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ అంత్యక్రియల్లో పాల్గొనడానికి పాకిస్థాన్, తజికిస్తాన్, ఆర్మేనియా, జార్జియా వంటి దేశాల నేతలు సిద్ధమవుతున్నారు.
అదే విధంగా టర్కీ, చైనా, రష్యా నుండి కూడా అధికారిక ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారం. భారత్ నుంచి బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ అంత్యక్రియలు ఆధునిక చరిత్రలోనే అత్యంత భారీ ప్రజా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత కుమారుడు మొజ్తబా ఖమేనీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి దాడులు లేదా బెదిరింపులు జరిగినా కఠినంగా స్పందిస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.








