స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ అంతర్గత వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం అత్యంత నీచమైన చర్య అని, అది “కన్నతల్లికి ద్రోహం చేసినట్టే” అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బూత్ స్థాయి అధ్యక్షులు, మండల నాయకులతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో సంజయ్ తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.
“నాకు ఎలాంటి గ్రూపులు లేవు. బీజేపీయే నా గ్రూప్” అని స్పష్టం చేస్తూ, పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు. “ఎవరైనా గ్రూపు రాజకీయాలు చేస్తే, వారు పార్టీ శ్రేయస్సు కోసం కాకుండా స్వప్రయోజనం కోసం పని చేస్తున్నట్టే” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకమని, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడివరకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “గెలుపు అవకాశాలే ప్రధాన ప్రమాణం. సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఈ నిర్ణయాల్లో నా అభిప్రాయం తుది కాదు” అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, హైకోర్టు తీర్పు ఏదైనా వచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, టిక్కెట్లు ఆశించే వారు తమ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధిపై మాట్లాడుతూ బండి సంజయ్, “దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులిచ్చిన ఏకైక ఎంపీ నేనే” అని గర్వంగా తెలిపారు. “కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు ఒక్క రూపాయినీ ఇవ్వడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంది” అని ఆరోపించారు.
తన ప్రసంగంలో ఆయన ప్రజా మద్దతు పొందడానికి స్పష్టమైన వ్యూహాన్ని సూచించారు. “ప్రతి ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓటు అడగండి. బీజేపీ గెలిస్తేనే గ్రామాలకు అభివృద్ధి వస్తుంది. నేను నిధులు తెచ్చి చూపిస్తాను” అని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తన శైలి, స్పష్టమైన మాటలతో మరోసారి పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ను ఉద్దేశించి కఠినమైన హెచ్చరికలు జారీ చేసిన బండి సంజయ్, స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ భవిష్యత్తు ప్రతిష్ఠాత్మక పోరాటంగా మలచాలని పిలుపునిచ్చారు.








