దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నేడు తన 52వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా గర్వకారణంగా, భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
స్టార్ హీరో మహేశ్ బాబు కూడా రాజమౌళికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒకే ఒక్కడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను. అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి సర్” అంటూ మహేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం SSMB29 చుట్టూ భారీ హైప్ నెలకొంది. ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
తెలుగు సినిమా ప్రపంచ పటంలో గర్వంగా నిలిచేలా చేసిన రాజమౌళికి పరిశ్రమ అంతా శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆయన తదుపరి సినిమా వివరాలపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
