Government 50 OTT Apps: డిజిటల్ వేదికల్లో అసభ్యకర కంటెంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన 50 ఓటీటీ యాప్లకు దేశవ్యాప్తంగా యాక్సెస్ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ ఇదే కారణాలతో పలు ఓటీటీ యాప్లపై చర్యలు తీసుకున్న కేంద్రం, తాజాగా మరో భారీ జాబితాను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్సభలో ప్రకటించారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ప్రసారమయ్యే కంటెంట్ను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందని, చట్టాలను అతిక్రమించే సేవలపై అవసరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
సమాచార సాంకేతిక నిబంధనలు-2021లోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తనిఖీల్లో కొన్ని యాప్లలోని కంటెంట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 294, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. నిషేధానికి గురైన 50 యాప్ల పేర్లను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. అయితే అక్రమ, అభ్యంతరకర కంటెంట్ను నియంత్రించేందుకు డిజిటల్ వేదికలపై పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇక నిషేధిత యాప్లు వినియోగంలోకి రాకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు యాక్సెస్ను నిలిపివేయాలని, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి వాటిని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. డిజిటల్ మధ్యవర్తులు ప్రభుత్వ నోటీసులు లేదా కోర్టు ఆదేశాలు వచ్చినప్పుడు చట్టవిరుద్ధమైన కంటెంట్ను నిర్ణీత సమయంలో తొలగించాలని కొత్త ఐటీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ALSO READ: Central Government | విద్యార్థుల ఆందోళనకు స్పందన.. ఢిల్లీలో కీలక భేటీ








