Dharmendra Pradhan: కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తన నిర్ణయానికి గల కారణాలను రాజీనామా లేఖలో వివరించారు. భారత ప్రజాస్వామ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ యువత ఆశయాలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని, అయితే ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువశక్తిని అపోహలు, దుష్ప్రచారాల ప్రభావానికి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. యువత తమ సమయాన్ని చదువు, కెరీర్ అభివృద్ధికే కేటాయించాలని ఆయన సూచించారు. దేశ ఐక్యతకు భంగం కలిగించే పరిస్థితులను ఎవ్వరూ తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదని కూడా పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించినట్లు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, మంత్రివర్గ సహచరులు, అధికారులకు, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపారు. దేశసేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఒడిశా ప్రజలు, భారత యువత కోసం అదే అంకితభావంతో పనిచేస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు.
ALSO READ: Public Protest | విమర్శకు హద్దులు ఉండాలి.. సంస్కారం మర్చిపోవద్దు!








