Yadadri Temple: దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించేలా యాదాద్రి క్షేత్రాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం” కింద దాదాపు రూ.500 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత యాదాద్రికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సెలవు దినాలు, పండుగల సమయంలో లక్షలాది మంది దర్శనానికి తరలివస్తున్నారు. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని వసతి, రవాణా, పార్కింగ్ సదుపాయాల అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో ఆధునిక రింగ్ రోడ్లు, మల్టీ-లెవెల్ పార్కింగ్ కేంద్రాలు, మెరుగైన రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణహిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తరించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు, ఆధునిక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, అధిక ప్రమాణాల కాటేజీలు, కన్వెన్షన్ సెంటర్లు, మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదే పథకం కింద నాగార్జునసాగర్లోని బుద్ధవనం, వికారాబాద్ అనంతగిరి కొండల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే యాదాద్రి దేశీయ భక్తులతో పాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: MK Stalin | విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు.. మూడు నెలలైనా నిలుస్తుందా?








