MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వ భవిష్యత్తుపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వీసీకే మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన అనుచరులతో కలిసి డీఎంకేలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విమర్శలు చేయడం తగదని భావించి కొంతకాలం మౌనం పాటించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి పనిచేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బహిరంగ విమర్శలకు దూరంగా ఉన్నానని చెప్పారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే తాను అనుకున్నంత కాలం వేచి ఉండగలనో లేదో తెలియడం లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థిరత్వంపై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. చర్చ ఇప్పుడు ఆరు నెలలు లేదా ఐదు నెలల గురించి కాదని, ఈ ప్రభుత్వం రాబోయే నెలల్లో కొనసాగగలదా అనే అంశంపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే కార్యక్రమంలో డీఎంకేలో చేరిన నాయకులు, కార్యకర్తలకు స్టాలిన్ కీలక సూచనలు చేశారు. గతంలో ఉన్న పార్టీలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయ మర్యాదలు పాటించాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
ALSO READ: Sensex and Nifty | యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పతనం








