ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. WHO అధినేత టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రేయేసస్ ఈ వైరస్ వ్యాప్తిని అత్యంత జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ఇటీవల ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్లో(MV Hondius cruise ship) వైరస్ వ్యాప్తి చోటుచేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఫ్రాన్స్కు చెందిన ఓ మహిళ పరిస్థితి తీవ్రంగా మారి వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే ఓ డచ్ దంపతులు, ఓ జర్మన్ పౌరుడు మృతి చెందగా, మొత్తం తొమ్మిది మందికి ఆండీస్ వేరియంట్ హాంటావైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
అర్జెంటీనా నుంచి కేప్ వెర్డేకు ప్రయాణిస్తున్న నౌకలో ప్రయాణికుల మధ్య సన్నిహిత సంబంధాల కారణంగా వైరస్ వేగంగా వ్యాపించినట్లు WHO పేర్కొంది. సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ అరుదుగా మనుషుల మధ్య కూడా సోకే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉండటంతో రాబోయే వారాల్లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని టెడ్రోస్ తెలిపారు.
ఇక స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను WHO ప్రశంసించింది. కేప్ వెర్డేకు వెళ్లాల్సిన నౌకను టెనెరిఫే పోర్టుకు మళ్లించి 120 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బందిని తరలించారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పందనను WHO ప్రశంసించింది.
బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సహా పలు దేశాలు తమ పౌరులను ఐసోలేషన్లో ఉంచాయి. నెదర్లాండ్స్ చేరిన ప్రయాణికులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు వైరస్ మ్యూటేషన్పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రోటర్డామ్కు తిరుగు ప్రయాణంలో ఉన్న నౌకలో వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.








