Petrol and Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమల్లోకి తీసుకొచ్చిన తాత్కాలిక పరిమితులను పూర్తిగా తొలగిస్తూ జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులు కూడా రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రవాణా సంస్థలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఇంధనం వినియోగించే వారికి పెద్ద ఊరట లభించింది.
మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గతంలో అత్యవసర చర్యలు చేపట్టింది. రిటైల్ అవుట్లెట్ల వద్ద ఇంధన నిల్వలు తగ్గకుండా ఉండేందుకు వాణిజ్య వినియోగదారుల కొనుగోళ్లపై పరిమితులు విధించడంతో పాటు, ఒక్కో వాహనానికి రోజుకు 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొంత స్థిరపడటం, దేశీయ సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీ వ్యవస్థ మళ్లీ సాధారణ విధానంలో కొనసాగనుంది. గత నెలలో రిటైల్ బంకుల్లో డీజిల్ ధరలు బల్క్ సరఫరాతో పోలిస్తే తక్కువగా ఉండటంతో ట్రాన్స్పోర్ట్ సంస్థలు, పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వ రంగ బంకుల నుంచే ఇంధనం కొనుగోలు చేశాయి. దీంతో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులపై అదనపు ఒత్తిడి ఏర్పడింది.
ఇప్పుడు పరిమితులు తొలగించడంతో వాణిజ్య వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి పరిమితి లేకుండా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం రవాణా రంగంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా ఉపశమనం కలిగించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Petrol and Diesel | ఇంధన వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేత?
-








