Whatsapp New Feature: కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘షెడ్యూల్డ్ మెసేజెస్’ ఫీచర్ను ప్రవేశపెట్టేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ కొత్త సదుపాయం ద్వారా వినియోగదారులు ముందుగానే తేదీ, సమయాన్ని ఎంపిక చేసి సందేశాలను ఆటోమేటిక్గా పంపించుకునే అవకాశం పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, గరిష్టంగా రెండు వారాల ముందుగానే మెసేజ్లను షెడ్యూల్ చేయవచ్చు. దీని ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు, సమావేశాల రిమైండర్లు, ముఖ్యమైన సమాచారం వంటి వాటిని ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను ఉపయోగించేందుకు ప్రత్యేక సెట్టింగ్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.
నేరుగా చాట్ విండోలోనే మెసేజ్ టైప్ చేసిన తర్వాత ‘సెండ్’ బటన్ను కొద్దిసేపు నొక్కి ఉంచితే షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ వినియోగదారులు కావలసిన తేదీ, సమయాన్ని ఎంచుకుని మెసేజ్ను షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది ఐఫోన్ వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్లు లేదా ఆపిల్ షార్ట్కట్స్ ద్వారా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే వాటిలో గోప్యతా సమస్యలు ఉండే అవకాశం ఉండటంతో, వాట్సాప్ స్వయంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తేవడం వినియోగదారులకు మరింత సురక్షితంగా మారనుంది.
ఈ కొత్త సిస్టమ్లో షెడ్యూల్ చేసిన మెసేజ్లను నిర్వహించేందుకు ప్రత్యేక విభాగం కూడా ఉండనుంది. అక్కడ పెండింగ్ మెసేజ్లు, పంపే సమయాలు కనిపించడంతో పాటు అవసరమైతే ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం కూడా సాధ్యమవుతుంది. ఈ సౌకర్యం వ్యక్తిగత చాట్స్తో పాటు గ్రూప్ చాట్స్కూ వర్తించనుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ముందుగానే మెసేజ్లు సిద్ధం చేసుకోవడం ద్వారా వినియోగదారులకు సమయం ఆదా కావడంతో పాటు మరింత సౌలభ్యం కలుగనుంది. ఈ ఫీచర్ రాకతో మెసేజ్ మర్చిపోవడం వంటి సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంది.








