Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మరో ఆరుగురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. కార్మికులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి అదనంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. మృతులు శాశ్వత ఉద్యోగులు అయిన, ఒప్పంద కార్మికులు అయిన ప్రభుత్వానికి అందరూ సమానమేనని చెప్పారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై లోపం ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని తెలిపారు. ఇలాంటి ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారని, అన్ని కోణాల్లో పరిశీలన కొనసాగుతోందని వెల్లడించారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటంతో పాటు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించామని పేర్కొన్న మంత్రి, భవిష్యత్తులో కూడా ప్లాంట్ అభివృద్ధి, భద్రతపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Nara Lokesh | స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం… మంత్రి లోకేశ్ హామీ
-








