TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారి కరూర్కు వచ్చిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కరూర్ తొక్కిసలాట తన రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా అత్యంత బాధాకరమైన సంఘటన అని విజయ్ పేర్కొన్నారు. ఈ ఘటన సాధారణ ప్రమాదం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
సభ నిర్వహణ సమయంలో పోలీసులు సరైన హెచ్చరికలు ఇవ్వలేదని, పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో టీవీకే బలాన్ని చూసి ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు భిన్నమైన పాలన అందిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను టీవీకే వ్యతిరేకిస్తోందని విజయ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా భవిష్యత్తులో రాష్ట్రంలో జన్మించే శిశువులకు ప్రభుత్వం తరఫున బంగారు ఉంగరాలు అందించే ఆలోచన ఉందని ప్రకటించారు. విజయ్ పర్యటన నేపథ్యంలో కరూర్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.








