Heavy Rains: ఉత్తర భారత రాష్ట్రాలను భారీ వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం కనిపిస్తోంది.
సంత్ కబీర్ నగర్, కుషినగర్, బులంద్షహర్, షామ్లీ, ఘజియాబాద్ ప్రాంతాల్లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గుజరాత్లోని సూరత్ నగరంలోనూ రోడ్లపై భారీగా నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉత్తరాఖండ్లో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో పాఠశాలలను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా అనేక రహదారులు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉత్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేను మూసివేశారు. దీంతో చార్ ధామ్ యాత్రకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఘజియాబాద్, మీరట్, హాపూర్, బులంద్షహర్ తదితర ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది.








