TSPSC Chairman: తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సంతోషకరమైన వార్త తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా కొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 3,800 ఉద్యోగాల భర్తీకి కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే 3,093 పోస్టులు ఉండగా, మిగతా విభాగాల్లో చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయి.
ఇకపై నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించిందని చెప్పారు. అంతేకాదు, రేపే మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇకపై గరిష్టంగా ఒక సంవత్సరంలో పూర్తిచేస్తామని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అలాగే పరీక్షల్లో లీకేజీలకు అవకాశం లేకుండా కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
ఇకపై అన్ని టీజీపీఎస్సీ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు పరీక్ష పూర్తిచేసిన వెంటనే తమ స్కోర్ గురించి క్లారిటీ పొందేలా కొత్త టెక్నాలజీని తీసుకురానున్నట్లు హింట్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతి అభ్యర్థికి ఉద్యోగం రావడం సాధ్యం కాదని, కేవలం పరిమిత శాతం మందికే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగం దక్కని వారు నిరాశతో ఫేక్ ప్రచారాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ మార్పులు నిరుద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.








