Maharashtra: మహారాష్ట్రలో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా చెరుకు పొలంలో దిగిన ఘటన కలకలం రేపింది. రెడ్ బర్డ్ విమాన శిక్షణ కేంద్రానికి చెందిన ఈ చిన్న విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద ఉదయం చోటుచేసుకుంది.
అధికారుల వివరాల ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటలకు శిక్షణలో భాగంగా విమానం గాల్లో ప్రయాణిస్తోంది. గ్రామానికి ఉత్తర దిశలో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా విమాన ఇంజిన్ అకస్మాత్తుగా శక్తిని కోల్పోయింది. పరిస్థితిని వెంటనే గుర్తించిన శిక్షణ పైలట్ అప్రమత్తమై సమీపంలోని చెరుకు పొలాన్ని గుర్తించి విమానాన్ని సురక్షితంగా కిందికి దించాడు.
పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు. విమానంలో ఉన్న సిబ్బందికి కూడా గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే ఆకస్మిక అత్యవసర పరిస్థితి కారణంగా పైలట్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం.
విమానం పొలంలో దిగిందన్న సమాచారం తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు, స్థానిక పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా విమాన ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంజిన్ వైఫల్యానికి దారితీసిన కారణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.








